శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జులై 2020 (20:15 IST)

కేరళలో చేపల చిల్లర వ్యాపారి ఎంత పని చేశాడు...

కరోనా వైరస్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదైన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. పైగా, దేశంలో తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రం కూడా ఇదే. అయితే, ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే యేడాది జూలై నెలాఖరు వరకు లాక్డౌన్ నిబంధనలు అమలు చేయనుంది. అయితే, ఈ రాష్ట్రానికి చెందిన ఓ చేపల చిల్లర వ్యాపారి ఒకరు ఏకంగా 119 మందికి కరోనా వైరస్ సోకేందుకు కారణమయ్యాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి సమీపంలోని పూందోరా అనే గ్రామానికి చెందిన ఓ చేపల వ్యాపారి క్రమం తప్పకుండా తమిళనాడులోని కుమరిచండ అనే గ్రామంలోని చేపల మార్కెట్‌కు వెళ్లి చేపలు విక్రయిస్తూ వచ్చాడు. దీంతో అతనికి కరోనా సోకగా, అతని ద్వారా మరో 119 మందికి ఈ వైరస్ సోకింది. ఈయన నివసించే గ్రామానికి చెందిన 600 మందికి ఈ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 119 మందికి వైరస్ సోకినట్టు తేలింది. మిగిలినవారి ఫలితాలు రావాల్సివుంది. 
 
ఈ చేపల వ్యాపారి కారణంగా కోవిడ్ క్లస్టరుగా మారిన ఈ గ్రామంలో ప్రత్యేక బలగాలతో పాటు.. ఆరోగ్య సిబ్బందిని నియమించి శానిటైజేషన్ చర్యలు, ఇతర వైద్య సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా, పోలీసు బలగాలను తరలించి, గ్రామస్తులు ఎవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కట్టడి చేశారు. అలాగే, ఈ వైరస్ లక్షణాలు కనిపించినవారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.