శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (17:39 IST)

రంజీల్లోకి రానున్న శ్రీశాంత్.. కేరళ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్

టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ మళ్లీ రంజీల్లోకి అడుగుపెట్టనున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్.. రంజీల్లో ఆడుతాడు. ఇందుకు కేరళ క్రికెట్ బోర్డు(కేసీఏ) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరుతో శ్రీశాంత్‌పై ఉన్న నిషేధ కాలం ముగియనుండడంతో అతడిని రంజీల్లోకి తీసుకోనున్నట్లు కేరళ క్రికెట్ బోర్డు తెలిపింది.
 
కేరళ బోర్డు ప్రధాన కోచ్ టినూ యోహానన్ దీనిపై స్పందిస్తూ, శ్రీశాంత్‌ను తిరిగి రంజీల్లోకి తీసుకునే అవకాశం ఉందని, అయితే అతడు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
 
కాగా, 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకుగానూ శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించారు. అతడితోపాటు రాజస్థాన్ రాయల్స్‌కే చెందిన అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు కూడా క్రికెట్‌కు జీవితకాలం దూరమయ్యారు. 
 
అయితే దీనిపై కోర్టుకెక్కిన శ్రీశాంత్ రెండేళ్ల పాటు పోరాడి ఎలాగోలా జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించుకున్నాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబరుతో అతడి నిషేధ గడువు పూర్తి కానుంది. ఇలాంటి తరుణంలో రంజీల్లో అతడి ప్రవేశం వుంటుందని క్రీడా పండితులు అంటున్నారు.