శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (20:03 IST)

యజ్ఞ చికిత్సతో కరోనాకు చెక్ : మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాగూర్

ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకు చెందిన మంత్రులు లేదా ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు దేశ ప్రజలంత తల్లడిల్లిపోతుంటే... బీజేపీ నేతలు మాత్రం ప్రజలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. పైగా, కరోనా వైరస్ ప్రభావం లేనేలేదనేనాలా వారి మాటలు ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు వివాదం కావడంతో తిరిగి వివరణ ఇచ్చుకుంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 
 
ఈ క్రమంలో తాజాగా కొవిడ్ మహమ్మారికి సంబంధించి మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కొవిడ్ మూడో వేవ్ రాకుండా ఉండేందుకు నాలుగు రోజుల పాటు యజ్ఞం నిర్వహించాలని కోరారు. 
 
తాజాగా ఇండోర్ నగరంలో కొవిడ్ కేర్ సెంటరును ప్రారంభించిన మంత్రి ఉషాఠాకూర్ మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ శుద్ధి కోసం నాలుగు రోజులు యజ్ఞం చేయండి. ఇది యజ్ఞ చికిత్స. పూర్వ కాలంలో, మన పూర్వీకులు మహమ్మారిని వదిలించుకోవడానికి యజ్ఞ చికిత్స చేసేవారు. ఇది పర్యావరణాన్ని శుద్ధి చేస్తోంది, దీనివల్ల కొవిడ్ మూడో వేవ్ భారతదేశాన్ని తాకదు అంటూ సెలవిచ్చారు. 
 
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల కేసుల సంఖ్య పెరగడంతో ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలపై అధికభారం పడుతుంది. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై దాడి చేయకుండా దీన్ని విజయవంతంగా అధిగమించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేస్తోందన్నారు. కాగా, ఈమె వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు.. ఆఖరిసారి కూడా కాబోదు.