1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 మే 2021 (11:12 IST)

మాస్కులే శ్రీరామ రక్ష - ఎన్‌-95 రకం వాడగలిగితే ఉత్తమం

దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి నుంచి బయటపడాలంటే ముఖానికి మాస్కులు ధరించడమే ఏకైక మార్గమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదీ కూడా ఎన్‌-95 వంటి ప్రత్యేక రకం (హైఫై) మాస్కుల్ని వాడడం అన్నివిధాలా ఉత్తమమనీ, కనీసం వస్త్రంతో తయారైనవాటిని వాడినా ఎంతోకొంత రక్షణ ఖచ్చితంగా లభిస్తుందన్నారు. 
 
ఈ వైరస్ కారణంగా ఆరోగ్య వ్యవస్థపై ఎప్పుడూ లేని ఒత్తిడి పడుతోంది. వైరస్‌ వ్యాప్తి ఇంకా ఉద్ధృతమయ్యే అవకాశముంది. దీనిని తగ్గించటంపైనే ప్రస్తుతానికి దృష్టి సారించాలి. బాధితుల చికిత్సకు అవసరమైన వనరుల ఏర్పాటు అవసరం. మాస్క్‌లు ధరించటం, ర్యాపిడ్‌ టెస్ట్‌లు పెంచటంతో పాటు కొవిడ్‌ బారిన పడిన వారికి ఇంట్లోనే చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలి. 
 
అదేసమయంలో స్థానిక వ్యాప్తి ఆధారంగా చర్యలు చేపట్టాలి. వైరస్‌ నియంత్రణ విధానాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. జన సమూహాల్లో మాస్క్‌ ధరించటం లాంటి జాగ్రత్తలు ఎక్కడైనా పాటించాల్సిందే. ర్యాపిడ్‌ పరీక్షలు పెంచాలి. అనుమానంగా అనిపిస్తే ఎవరికివారు వెంటనే పరీక్ష చేయించుకుని వ్యాప్తిని నిలువరించాలి. పాజిటివ్‌ అని తేలితే ఏకాంతంలోకి వెళ్లడంతో పాటు లక్షణాలు ఉంటే దానికి తగ్గ చికిత్స తీసుకోవటం చాలా కీలకమని వారు అభిప్రాయడుతున్నారు. 
 
ముఖ్యంగా, హైఫై మాస్క్‌ల వాడుక ద్వారా వైరస్‌ వ్యాప్తి చాలావరకు తగ్గుతుంది. దాదాపు వ్యాక్సిన్‌ తీసుకున్నంత రక్షణ పొందొచ్చు. రెండో మార్గం... ఆంక్షలు. వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్‌ విధించుకోవాలి. లక్షణాలున్న వారు సొంతంగా పరీక్షలు చేయించుకునేలా చూడాలి.