1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (15:26 IST)

దేశంలో 578 ఒమిక్రాన్ కేసులు - కొత్త మార్గదర్శకాలు రిలీజ్

దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా నమోదయ్యే ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 578 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న కోవిడ్  సంబంధిత నిబంధనలను వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడగించింది. మహమ్మారి వ్యాప్తి నివారణకు తప్పనిసరిగా ఆదేశాలను పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోరింది. 
 
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముందు చూపు, డేటా విశ్లేషణతోపాటు స్థానిక, జిల్లా స్థాయిల్లో పకబందీ చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. 
 
ముఖ్యంగా, పండగ సీజన్‌లో రద్దీని నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలు అవసరానికి అనుగుణంగా నిబంధనను విధించవచ్చని కేంద్రం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.