1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (10:28 IST)

2031 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భారత్ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందుతుంది. ఫలితంగా వచ్చే 2031 నాటికి ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఈ మేరకు "ది సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్స్" (సీఈబీఆర్) తాజాగా వెల్లడించిన నివేదికలో పేర్కొంది. 
 
లండన్ కేంద్రంగా పని చేసే ఈ ఆర్థిక కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన వార్షిక నివేదిక "వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్" ప్రకారం 2021లో భారత్ ప్రపంచంలో 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే యేడాది ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి 6వ స్థానానికి చేరుకుంటుంది. ఆ ర్వాత 2031 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా కరోనా కష్టాలను భారత్ త్వరితంగానే అధిగమించిందని కొనియాడింది. ఈ కారణంగానే 2020లో జీడీపీ 7.3 శాతం క్షీణతను నమోదు చేసినప్పటికీ 2021లో 8.5 శాతం వృద్ధి చెందే వీలుందని వివరించింది. 
 
మరోవైపు, 2022లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా 100 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.7,500 లక్షల కోట్ల)స్థాయికి చేరొచ్చని సీఈబీఆర్ నివేదిక తెలిపింది. కోవిడ్ పరిణామాల నుంచి క్రమంగా అంతర్జాతీయ జీడీపీ కోలుకోడం ఇందుకు కారణమని పేర్కొంది. 
 
కాగా, సీఈబీఆర్ నివేదిక ప్రకారం భారత జీడీపీ బిలియన్ డాలర్లలో... 2011లో 1823 (10వ స్థానం), 2020లో 2660 (6వ స్థానం), 2021లో 2919 (7వ స్థానం), 2022లో 3190 (6వ స్థానం), 2026లో 4316 (5వ స్థానం), 2031లో 6821 (3వ స్థానం) బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది.