గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (13:29 IST)

ఎమర్జెన్సీ వినియోగం కింద కోవిషీల్డ్‌కు కేంద్రం అనుమతి?

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు ఫార్మా కంపెనీలు టీకాలను తయారు చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనికా - సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి తయారు చేసిన కోవిషీల్డ్ ఒకటి. ఈ టీకా వినియోగానికి ఇప్పటికే బ్రిటన్ వంటి అగ్రదేశం అనుమతి మంజూరుచేసింది. అలాగే, అమెరికాలనూ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. 
 
ఇకపోతే, రష్యా తన సొంతంగా తయారు చేసుకున్న వ్యాక్సిన్‌ను ప్రజలకు వేసేస్తోంది. అలాంటి సమయంలో మన దేశంలో కరోనా టీకాలు ఎపుడు అందుబాటులోకి వస్తాయన్న చర్చ సాగుతోంది. దీనిపై కేంద్ర వైద్య వర్గాలు స్పందిస్తూ, మన దేశంలో వచ్చేవారమే ఒక వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. 
 
ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనికా - సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి తయారు చేస్తున్న కొవిషీల్డ్‌ను ఆమోదించే అవకాశం ఉందంటున్నారు. ఆక్స్‌ఫర్డ్ కరోనా టీకాకు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపిన వెంటనే.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ) సమావేశమవుతుందని, వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధకత డేటాలను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 
 
అయితే, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవ్యాగ్జిన్ టీకా మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నందున, దానికి అనుమతులొచ్చేందుకు కొంత టైం పట్టే అవకాశాలున్నాయన్నారు. ఫైజర్ కూడా అనుమతులకు దరఖాస్తులు చేసిందన్నారు. అయితే, వ్యాక్సిన్‌కు సంబంధించిన ట్రయల్స్‌పై కంపెనీ ఇంకా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉందని చెప్పారు. 
 
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికే అడ్వాన్స్ దశలో ఉన్న కొవిషీల్డ్‌కే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉందని వివరించారు. వ్యాక్సిన్ భద్రత, ట్రయల్స్ సమాచారాన్ని ఇదివరకే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు ఇచ్చింది.