గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (12:47 IST)

మనసున్న మారాజు పాండ్యా... మాజీ క్రికెటర్‌కు బ్లాంక్ చెక్...

భారత యువ క్రికెటర్ కృనాల్ పాండ్యా తన మంచి మనసును మరోమారు చూపాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాల కోసం పోరాటం చేస్తున్న మాజీ క్రికెటర్‌ వైద్య ఖర్చుల కోసం ఓ బ్లాంక్ చెక్‌ను పంపించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గత యేడాది డిసెంబరు 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ తీవ్రంగా గాయపడ్డారు. జాకబ్ మార్టిన్ ఊపిరితిత్తులు, కిడ్నీలు ఈ ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయన్ను వడోదరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఆయన వైద్య ఖర్చుల కోసం ఇప్పటికే బీసీసీఐ రూ.5 లక్షలు, బరోడా క్రికెట్ అసోసియేషన్ రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయగా, మరికొంతమంది సాయం చేశారు. అలాగే, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రవిశాస్త్రి కూడా సాయం చేస్తామని హామీ ఇవ్వగా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, మునాఫ్ పటేల్ ఇప్పటికే తమవంతు సాయం చేశారని తెలిపారు
 
ఈ పరిస్థితుల్లో ఇపుడు కృనాల్ పాండ్యా కూడా ముందుకు వచ్చి ఓ బ్లాంక్ చెక్ పంపించి.. తన మంచి మనసును చాటుకున్నాడు. 'సార్... ఈ ఖాళీలో మీకు కావాల్సినంత రాసుకోండి. అది లక్షకు తక్కువ మాత్రం కాకూడదు' అంటూ చెక్కును బరోడా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంజయ్ పటేల్‌కు పంపారు. 
 
కాగా, గంగూలీ కెప్టెన్‌గా ఉన్న 1999 సంవత్సరంలో టీమిండియా తరపున మార్టిన పది వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇపుడు ప్రాణాలతో పోరాటం చేస్తున్న జాకబ్‌ను రక్షించుకునేందుకు మార్టిన్ కుటుంబం కృషి చేస్తోంది. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ... ఎవరినైనా సహాయం అడగాలా? వద్దా? అన్న మీమాంసలో మార్టిన్ ఫ్యామిలీ ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఎవరికి వారు సొంతంగానే స్పందిస్తున్నారు.