ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (17:29 IST)

కంగారుల వెన్నువిరిచిన భారత బౌలర్లు... ఢిల్లీ టెస్టులో 263 ఆలౌట్

team india
గవాస్కర్ - బోర్డర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, జడేజాలు పోటీపడి వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూకట్టారు. 
 
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్ సేను జట్టు స్కోరు 50 పరుగుల వద్ద ఉండగా తొలి దెబ్బ తగిలింది. 15 పరుగులు చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను షమీ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత 91 పరుగుల వద్ద మార్నస్ లబుషేన్‌ (18), స్టీవ్ స్మిత్ డకౌట్ రూపంలో ఔట్ చేశారు. 
 
ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు వరుసగా వికెట్లు కోల్పోసాగింది. అయితే, హ్యాండ్స్‌కోంబ్ చివరి బంతి వరకు నిలిచి 72 పరుగులు చేశాడు. ఆసీస్ కెప్టెన్ కూడా 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీకి 4 వికెట్లు, అశ్విన్‌, జడేజాకు చెరో మూడు వికెట్లు చొప్పున తీశారు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.