1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:11 IST)

'మిస్టర్ కూల్' స్టైలిష్ ఫినిషింగ్ టచ్ - ముంబైకు 'ఏడు'పే

msdhoni
ఐపీఎల్ 15వ అంచె పోటీల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఖాతాలో మరో ఓటమి చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనదైనశైలిలో ఫనిషింగ్ టచ్ ఇవ్వడంతో ముంబై జట్టు ఆఖరి ఓవర్‌లో ఓడిపోయింది. ఇది ముంబైకు వరుసగా ఏడో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు విజయం అంచులవరకు వచ్చి ఓడిపోవడాన్ని ముంబై ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేసి పెవిలియన్‌కు క్యూ కట్టారు. తిలక్ వర్మ అర్థ సెంచరీ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 రన్స్) చేయడంతో ముంబై జట్టు ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ 32, హృతిక్ షాకీన్ 25, ఉనద్కత్ 19 చొప్పున పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో ముకేష్ చౌదరి 3, బ్రావో రెండు వికెట్లు చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 156 పరుగుల స్వల్వ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై అపసోపాలు పడింది. చివరి బంతివరకు మ్యాచ్‌ను లాక్కెళ్లి పీకల మీదకు తెచ్చుకుంది. అయితే, ధోనీ మరోమారు జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. చివరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సివుంది. ఈ క్రమంలో ప్రిటోరియస్ (22) వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ మిస్టర్ కూల్ ధోనీ ఉనద్కత్ బౌలింగ్‌లో 6, 4, 2, 4 చొప్పున పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. 
 
చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సిన తరుణంలో ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. రాబిన్ ఊతప్ప 30, అంబటి రాయుడు 40, ధోనీ 28 (నాటౌట్), ప్రిటోరియస్ 22 చొప్పున పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో శ్యామ్స్ 4, ఉనద్కత్ 2 చొప్పున తీశారు. చెన్నై బౌలర్ ముకేష్ చౌదరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.