గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 6 నవంబరు 2018 (12:26 IST)

ట్వంటీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్థాన్‌

కివీస్‍తో జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌ను పాకిస్థాన్‌ క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టి20లో పాక్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ 3-0తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్ బాబర్ ఆజమ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. 
 
కివీస్ బౌలర్లను హడలెత్తించిన బాబర్ ఆజమ్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 58 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఆసీస్‌తో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌ను కూడా పాకిస్థాన్ వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ అదరగొట్టింది. ధాటిగా ఆడిన మహ్మద్ హఫీజ్ 4ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో పాక్ స్కోరు 166కు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. 
 
ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ విలియమ్సన్ 38 బంతుల్లో 8ఫోర్లు, రెండు సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. ఓపెనర్ ఫిలిప్ (26), ఐష్ సోధి 11(నాటౌట్) తప్ప మిగతావారు కనీసం రెండంకెలా స్కోరును అందుకోలేక పోయారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ మూడు, ఇమాద్ వసీం, వఖాద్ మక్సూద్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.