శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 22 జూన్ 2019 (09:31 IST)

వరల్డ్ కప్ : ఇంగ్లండ్‌ను చావుదెబ్బకొట్టిన మలింగా... లంక గెలుపు

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం ఆతిథ్య ఇంగ్లండ్‌కు శ్రీలంక జట్టు తేరుకోలేని షాకిచ్చింది. లంకేయులు నిర్ధేసించిన స్వల్ప విజయలక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. దీంతో ఇంగ్లండ్ జట్టు సొంత గడ్డపై ఓటమిని చవిచూసింది. పైగా, భీకర ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్లు కూడా లంకేయులు బౌలింగ్‌ ధాటికి కుప్పకూలిపోయారు. ముఖ్యంగా, లసిత్ మలింగా ఇంగ్లండ్ జట్టును చావుదెబ్బకొట్టాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్ చేసిన ఒంటరిపోరాటం కూడా వృథా అయింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. లంక  బ్యాట్స్‌మెన్లను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడిచేశారు. ఫలితంగా లంక భారీ స్కోరు చేయలేక పోయింది. 50 ఓవర్లలో అతికష్టంమ్మీద 232 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోలేక లంక బ్యాట్స్‌మెన్లు అష్టకష్టాలు పడ్డారు. లంక ఓపెనర్లు కేవలం మూడు పరుగులకే ఔట్ కాగా, మిడిలార్డర్‌లో ఫెర్నాండో (49), మెండిస్ (46)లు కొంతమేరకు పోరాడారు. 
 
ఒక దశలో 38 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఆ తర్వాత మిగిలిన 12 ఓవర్లలో ఆ జట్టు పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఏంజెలో మాథ్యూస్ 85 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో రాణించడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ధనంజయ డిసిల్వ (29),  నుంచి మాథ్యూస్‌కు మంచి సహకారం అందింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, వుడ్ చెరో 3 వికెట్లు తీయగా, అదిల్ రషీద్ 2 వికెట్లు సాధించాడు. 
 
ఆ తర్వాత 234 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 212 పరుగులకే ఆలౌట్ అయింది. మరో మూడు ఓవర్లు ఉండగానే చేతులెత్తేసింది. దీంతో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. లంక బౌలర్ లసిత్ మలింగా, ధనంజయ డి సిల్వా బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటింగ్ కకావికలమైపోయింది. వీరిద్దరి బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న బెన్ స్టోక్స్ (82 నాటౌట్), జో రూట్‌ (57)లు మాత్రమే కొంతసేపు ప్రతిఘటించారు. 
 
అయినప్పటికీ టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు ఏమాత్రం సహకారం అందించలేక పోవడంతో ఓటమిని చవిచూడాల్సివచ్చింది. ఇకపోతే మలింకా 4 వికెట్లు తీయగా, డి సిల్వా 3 వికెట్లు తీశారు. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన లసిత్ మలింగాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.