శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (12:31 IST)

క్రికెటర్ సూర్య మెసేజ్ వల్లే ఆ భాగ్యం కలిగింది : సర్ఫరాజ్ తండ్రి

sarfaraj khan parents
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న సుధీర్ఘ నిరీక్షణ సర్ఫరాజ్ ఖాన్‌కు ఫలించింది. రాజ్‌కోట్ వేదికగా పర్యాటక ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి రోజు టాస్‌కు ముందు టీమ్‌ భారత క్యాప్‌ అందుకునే సమయంలో అతడి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అయితే, బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వల్లే తన కుమారుడి అరంగేట్రాన్ని ప్రత్యక్షంగా చూశానని సర్ఫరాజ్‌ తండ్రి నౌషద్‌ ఖాన్‌ చెప్పాడు. అతడి మెసేజ్‌ వల్లే తాను రాజ్‌కోట్‌కు వచ్చానని చెప్పారు. 
 
'నేను మ్యాచ్‌కు వస్తే సర్ఫరాజ్‌ ఒకింత ఒత్తిడికి లోనవుతాడని అనిపించింది. దీనికితోడు ఆరోగ్యం కూడా సహకరించలేదు. అందుకే రాకూడదని నిర్ణయించుకున్నాను. కానీ, సూర్య పంపించిన మెసేజ్‌తో నా మనసు కరిగింది. మీ ఉద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు మా అమ్మానాన్న నా వెనుకే ఉన్నారు. ఆ క్షణం ఎంతో ప్రత్యేకం. అలాంటివి మళ్లీ మళ్లీ రావు. అందుకే మీరు మ్యాచ్‌కు వెళ్తే బాగుంటుందని నా సలహా అని సూర్య మెసేజ్‌ పంపాడు అని నౌషద్‌ ఖాన్‌ తెలిపారు. అది చూడగానే తాను ఆగలేకపోయానన్నారు. తక్షణమే రాజ్‌కోట్‌కు బయల్దేరానని చెప్పారు. 
 
కాగా, భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే నుంచి సర్ఫరాజ్‌ టోపీ అందుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సర్ఫరాజ్‌ భార్య, తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నౌషద్‌ ఆ టోపీని తీసుకుని ముద్దాడాడు. తండ్రిని హత్తుకుని సర్ఫరాజ్‌ ఆనందాన్ని పంచుకున్నాడు. అనంతరం భార్య కన్నీళ్లను తుడిచాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.