గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (11:06 IST)

ఐపీఎల్‌కు కరోనా గండం : తప్పుకుంటున్న ఆటగాళ్లు.. అంపైర్ల కుంటిసాకులు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీని కరోనా వైరస్ మహమ్మారి వెంటాడుతోంది. దీంతో ఈ నెల 19వ తేదీ నుంచి జరగాల్సిన ఐపీఎల్ టోర్నీపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. ఒకవైపు ఆటగాళ్లు, మరోవైపు అంపైర్లు, ఇంకోవైపు సహాయక సిబ్బంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో ఈ టోర్నీ నిర్వహణ అనుమానాస్పదంగా మారింది. 
 
నిజానికి ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన ఈ టోర్నీ కరోనా వైరస్ కారణంగా వాయిదాపడింది. ప్రస్తుతం ఈ టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో భాగంగా, ఈ నెల 19వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. అయితే, ఐపీఎల్-13వ సీజన్‌ను కరోనా పట్టిపీడిస్తోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు కరోనా వైరస్ బారినపడడంతో అంపైర్లు వణికిపోతున్నారు. అంపైరింగ్ విధులు నిర్వర్తించేందుకు జంకుతున్నారు. వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి తప్పుకుంటున్నారు.  
 
అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాలంటూ ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్లను బీసీసీఐ కోరగా కేవలం నలుగురు మాత్రమే ముందుకొచ్చారు. క్రిస్‌ గఫాని (న్యూజిలాండ్‌), రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ (ఇంగ్లండ్‌), మైఖేల్ గాఫ్‌ (ఇంగ్లండ్‌), నితిన్‌ మీనన్‌ (భారత్) తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. నిజానికి ఐపీఎల్‌కు కనీసం 15 మంది అంపైర్లు అవసరం. వీరిలో 12 మంది ఫీల్డ్, టీవీ అంపైర్లుగా విధులు నిర్వర్తిస్తారు. మిగతా వారు ఫోర్త్ అంపైర్లుగా ఉంటారు.
 
కాగా, పైన చెప్పిన నలుగురు మినహా మిగతావారు వ్యక్తిగత కారణాల సాకుతో దూరమవుతున్నారు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్‌లో భాగంగా ఉంటున్న కుమార ధర్మసేన కూడా ఈసారి దూరం కాబోతున్నట్టు సమాచారం. ఇందుకు అతడు చెప్పిన కారణం.. శ్రీలంకలో జరిగే క్రికెట్‌ టోర్నీలతో తాను బిజీగా ఉండడం. 
 
నిజానికి ఐసీసీ ఎలైట్ ప్యానల్ నుంచి బీసీసీఐ ప్రతిసారి ఆరుగురు అంపైర్లను తీసుకుంటోంది. ఈసారి మరింత ఎక్కువమందిని తీసుకోవాలని భావించింది. అయితే, రెండు నెలలపాటు పూర్తి నిర్బంధంలో విధులు నిర్వర్తించడం కష్టమన్న అభిప్రాయంతో ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వారి స్థానంలో భారత అంపైర్లను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించినట్టు సమాచారం.