1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (10:42 IST)

అండర్-19 ప్రపంచ కప్ : ఆస్ట్రేలియాను చిత్తు చేసిన యువభారత్

ఆంటిగ్వా వేదికగా అండర్‌-19 ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను భారత యువ జట్టు చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 50 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. అనంతరం 291 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 41.5 ఓవర్లు ముగిసే సమయానికి అన్ని వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. దీంతో 96 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఈ విజయంతో టైటిల్ పోరులో శనివారం ఇంగ్లండ్‌తో భారత్ యువజట్టు తలపడనుంది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత కుర్రాళ్లు నిర్ణీత 50 ఓవర్లలో 290 పరుగులు చేశారు. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని మూడో వికెట్‌కు ఏకంగా 204 పరుగుల భాగస్వామ్యాన్ని చోడించారు. 
 
వైస్ కెప్టెన్ షేక్ రషీద్ 108 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 94 పరుగులు చేయగా, కెప్టెన్ యశ్ ధుల్ మరోమారు పరుగుల వరద పారించాడు. 110 బంతుల్లో పది ఫోర్లు, సిక్సర్ సాయంతో 110 రన్స్ చేసి ఓ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా భారత జట్టు 290 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 291 పరుగుల భారీ విజయలక్ష్య చేదన కోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 41.5 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన దెబ్బకు కంగారులు క్రీజ్‌లో నిలదొక్కుకోలేక పోయారు. ఫలితంగా కెల్లావే 30, మిల్లర్ 38, షా 51 సహా మరెవ్వరూ రాణించలేక పోయారు. ఫలితంగా 194 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆగింది.