ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

రసవత్తంగా టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ : భారత్‌ను ఊరిస్తున్న విజయం

Kohli
లండన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ అత్యంత రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండగా.. భారత్ విజయానికి ఇంకా 280 పరుగుల దూరంలో ఉంది. అటు ఆసీస్ మరో ఏడు వికెట్లు తీస్తే విజయం సాధిస్తుంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లి (44 బ్యాటింగ్), రహానే (20 బ్యాటింగ్)లు ఉన్నారు. వీరిద్దరిపైనే భారత విజయావకాశాలు ఆధారపడివున్నాయి.
 
కొండంత లక్ష్యాన్ని ఛేదించాలంటే ప్రస్తుతం ఆటతీరునే మూడు సెషన్‌ల పాటు కొనసాగిస్తే.. భారత్ టెస్టు చరిత్రలోనే అత్యధిక ఛేదనను పూర్తి చేసుకున్నట్టవుతుంది. అయితే వికెట్లు కోల్పోకుండా ఆడడం అత్యంత కీలకం. శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 40 ఓవర్లలో 164/3 పరుగులు చేసింది. రోహిత్ (43) ఆకట్టుకున్నాడు. 
 
అంతకుముందు క్యారీ (66 నాటౌట్), స్టార్క్ (41) రాణించడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 270/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో కంగారూలకు 443 పరుగుల ఆధిక్యం లభించింది. జడేజాకు మూడు, ఉమేశ్.. షమిలకు రెండేసి వికెట్లు దక్కాయి. 
 
444 పరుగుల రికార్డు ఛేదనను భారత్ ఆత్మవిశ్వాసంతోనే ఆరంభించింది. రెండో సెషన్‌లో భారత్ 7.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి టీ బ్రేక్‌కు వెళ్లింది. అయినా అప్పటికే జట్టు స్కోరు 41 పరుగులకు చేరింది. దీనికి ఓపెనర్లు రోహిత్, గిల్ (18) వన్డే తరహాలో బ్యాట్లు ఝుళిపించడమే కారణం. ఎనిమిదో ఓవర్ తొలి బంతికి స్లిప్‌లో గ్రీన్ వివాదాస్పద క్యాచ్‌తో గిల్ వెనుదిరిగాడు. రీప్లేలో బంతి నేలకు తాకి నట్టు కనిపించినా.. గ్రీన్ చేతివేళ్లు బంతి కిందే ఉన్నట్టు భావించిన థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. 
 
ఇక ఆఖరి సెషన్‌లోనూ రోహిత్‌కు జతగా పుజార (27) సైతం వేగం కనబరిచాడు. చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అయితే అర్థసెంచరీ వైపు సాగుతున్న రోహిత్‌ను స్పిన్నర్ లియాన్ ఎల్బీగా వెనక్కి పంపాడు. తర్వాతి ఓవరులోనే పుజారను కమిన్స్ అవుట్ చేయడంతో భారత్ తడబడినట్టుగా కనిపించింది. కానీ విరాట్, రహానే జట్టును ఆదుకున్నారు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేశారు. దీంతో భారత్ మరో వికెట్ కోల్పోకుండా నాలుగో రోజును ముగించింది.