శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (11:29 IST)

నాలుగో టెస్ట్ మ్యాచ్ : భారత్ 365 రన్స్‌కు ఆలౌట్.. సెంచరీ కోల్పోయిన వాషింగ్టన్!

అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడి 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్‌కు కీలకమైన 160 పరుగుల ఆధిక్యం లభించింది. 
 
రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 7 వికెట్ల‌కు 294 ప‌రుగుల వ‌ద్ద మూడ‌వ రోజు ఉదయం బ్యాటింగ్‌ను ప్రారంభించిన భార‌త్‌.. మ‌రో 71 ర‌న్స్ జోడించి మిగితా వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ బల‌ర్ల‌ను సుంద‌ర్ స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాడు. అడ‌పాద‌డ‌పా త‌న స‌హ‌జ‌శైలిలో షాట్లు కొడుతూ స్కోర్ బోర్డును ప‌రుగెత్తించాడు. 
 
రెండో రోజు కీప‌ర్ రిష‌బ్ పంత్ సూప‌ర్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. బ్యాటింగ్‌కు క‌ష్టంగా మారిన మొతెరా పిచ్‌పై భార‌త బ్యాట్స్‌మెన్ కాస్త మెరుగ్గానే రాణించారు. మ‌రో రెండున్న‌ర రోజు ఆట మిగిలి ఉన్న నేప‌థ్యంలో మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా మారింది. 
 
భార‌త్‌కు 160 ప‌రుగుల ఆధిక్యం ఉన్నా.. ఇంగ్లండ్ త‌మ రెండో ఇన్నింగ్స్ ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే. శనివారం ఉద‌యం వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, అక్ష‌ర్ ప‌టేల్‌లు నిల‌క‌డ‌గా ఆడారు. ఆ ఇద్ద‌రూ ఎనిమిదో వికెట్‌కు 106 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పడం గమనార్హం. అక్ష‌ర్ ప‌టేల్ 43 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీసుకోగా జేమ్స్ అండ‌ర్స‌న్ మూడు, లీచ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.