శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (10:54 IST)

క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. మరోమారు లాక్డౌన్ తప్పదా?

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో మరోమారు లాక్డౌన్ తప్పదా అనే చర్చ సాగుతోంది. శనివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. గత 24 గంటల్లో 18,327 మందికి కరోనా నిర్ధారణ అయింది. మరో 14,234 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,92,088కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 108 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,656కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,54,128 మంది కోలుకున్నారు. 1,80,304 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,94,97,704 మందికి వ్యాక్సిన్ వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,06,92,677 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,51,935 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో కొత్త‌గా 170 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 28 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక్క‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 196 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,742కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,96,166 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,640 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,936 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 812 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.