గురువారం, 4 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జూన్ 2024 (12:12 IST)

ఆరు నెలలు ఎలా గడిచాయో తెలియదు.. ఒక్క మాట మాట్లాడలేదు.. : హార్దిక్ పాండ్యా

hardik pandya
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా భారత్ నిలిచింది. ఈ మ్యాచ్‌ విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించారు. ఆల్‌రౌండర్‌గా ఈ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక చివరి బంతిని వేసిన తర్వాత భావోద్వేగాలను నియంత్రిచుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. తన సహచురులను హత్తుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం తనను తాను నియంత్రణ చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీలక సమయంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్లాసెన్, డేవిడ్‌ మిల్లర్‌ను ఔట్ చేసిన పాండ్య మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
 
'ఈ ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. మా కష్టానికి ఫలితం దక్కింది. దేశం మొత్తం కోరుకున్న గొప్ప విజయాన్ని సాధించాం. మరీ ముఖ్యంగా ఇది నాకెంతో స్పెషల్. గత ఆరు నెలలు ఎలా గడిచాయో తెలిసిందే. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అనుకోని విషయాలు జరిగిపోయాయి. కష్టపడుతూ ఉంటే మరింత మెరుగవుతామని నాకు తెలుసు. అదే నేను చేశా. ఇలాంటి అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. మా ప్రణాళికలను అమలు చేయడంలో సక్సెస్ అయ్యాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడంతో విజయం సొంతమైంది. 
 
నాకు వారెవరో ఒక్క శాతం కూడా తెలియని వ్యక్తులు కూడా చాలా విషయాలు చెప్పారు. వాటితో నాకేమీ సమస్య లేదు. నేనెంటో తెలియజెప్పడానికి మెరుగైన మార్గాలను కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడీ ప్రదర్శనతో వారే సంతోషంగా ఉంటారనుకుంటా. జీవితాన్ని మార్చే అవకాశాలు చాలా తక్కువగా లభిస్తాయి. వాటిని అందిపుచ్చుకోవడం కీలకం. నేనెప్పుడూ ఒత్తిడిగా భావించను. నైపుణ్యాలపైనే దృష్టిపెట్టా. చివరి ఐదు ఓవర్లలో మేం పుంజుకున్న తీరు అద్భుతం. బుమ్రా మ్యాచ్‌ ఛేంజర్. నేను కూడా వందశాతం నిబద్ధతతో ప్రతి బంతిని విసిరా' అని పేర్కొన్నాడు.