1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (10:51 IST)

వరుణుడి చలువతో గట్టెక్కిన వెస్టిండీస్ - భారత్ విజయం

cricket stadium rainwater
ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌ వరుణ దేవుడి చలువతో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ఐదో రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారడంతో వెస్టిండీస్ గట్టెక్కింది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను వైట్ వాష్ చేయాలన్న భారత క్రికెట్ జట్టు ఆశలు ఆవిరైపోయాయి. వర్షం కారణంగా చివరి రోజు ఆట రద్దు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 
 
దీంతో రెండు టెస్టు సిరీస్‌ను భారత్ 1-0తో సరిపెట్టుకుంది. నాలుగో రోజే ఆటకు అడ్డుపడిన వర్షం దాదాపు ఒక సెషన్ మొత్తాన్ని అడ్డుకుంది. ఐదో రోజైనా కరుణిస్తాడని వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. ఆగుతూ సాగుతూ ఆటకు పూర్తిగా అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
 
మొత్తం 365 పరుగుల విజయ లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 28 పరుగులు చేయగా, మెకంజీ డకౌట్ అయ్యాడు. చందర్‌పాల్ 24, బ్లాక్‌వాడ్ 20 పరుగులతో క్రీజులోని వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 
 
సోమవారం కనుక మ్యాచ్ కనీసం రెండు సెషన్లు సాగినా విజయం భారత్ సొంతమయ్యేదే. అయితే, వాన అడ్డుపడి విండీస్‌ను వైట్‌వాష్ కాకుండా అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ నెల 27 నుంచి భారత్-విండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆరంభంకానుంది.