1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (10:44 IST)

ఆసియా కప్ : మూటముల్లె సర్దుకుని స్వదేశానికి భారత్

team india
దుబాయ్ వేదికగా ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరుగుతోంది. ఇందులో బలమైన జట్టుగా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు సూపర్-4 దశలో పేలమైన ఆటతీరుతో వరుస ఓటములను చవిచూసింది. ముఖ్యంగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, ఆ తర్వాత శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితులు ముందుగానే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆప్ఘనిస్థాన్ జట్టుతో నామమాత్రపు మ్యాచ్ ఆడింది. ఇందులో భారత ఆటగాళ్లు సింహాల్లా రెచ్చిపోయారు. ఇటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో చెలరేగిపోయారు. ఫలితంగా భారీ విజయంతో ఈ టోర్నీ నుంచి స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. 
 
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు బ్యాట్‌తో రెచ్చిపోయారు. కేఎల్ రాహుల్ 62 (41 బంతులు 2 సిక్స్‌లు, 6 ఫోర్లు), విరాట్ కోహ్లీ 122 (61 బంతులు 12 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు చేశారు. చివర్లో రిషభ్ పంత్ కూడా 20 (16 బంతులు 3 ఫోర్లు) పరుగులు చేయడంతో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 213 పరుగుల భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఆప్ఘనిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో ముజీబ్ 18, రషీధ్ ఖాన్ 15 చొప్పున పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరిగే బౌలింగ్ స్పెల్‌తో ఆప్ఘన్ ఆటగాళ్ల వెన్నులో వణుకు పుట్టించాడు. 
 
ఫలితంగా ఏ ఒక్కరూ క్రీజ్‌లో కుదురుకోలేక పోయారు. 4 ఓవర్లు వేసిన భువీ.. ఓ మేడ్‌ఇన్ ఓవర్‌తో కేవలం నాలుగంటే నాలుగు పరుగులు ఇచ్చిన ఏకంగా ఐదు వికెట్లు తీసి తన కెరీర్‌లో టీ20లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. ఇంత భారీ విజయం సాధించినప్పటికీ భారత్ మూటముల్లె సర్దుకుని ఇంటికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.