1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

వామ్మో అంత రేటా : రూ.లక్షల్లో పలుకుతున్న ఇండో-పాక్ టీ20 వరల్డ్ కప్ టిక్కెట్ ధర!!

india - pakistan
మరికొన్ని రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు మరోమారు క్రికెట్ మైదానంలో ప్రత్యక్షంగా తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇండో పాక్ మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. 
 
ఈ రెండు జట్ల మధ్య జూన్ 9వ తేదీన న్యూయార్క్‌లోని నన్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. అందులో డైమండ్ క్లాస్ సీట్లకు టికెట్ ధరను 20 వేల డాలర్లుగా నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. అంటే సుమారు రూ.16.6 లక్షలు అన్నమాట. దీనిపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ తీవ్రంగా మండిపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని తప్పుపడుతూ ఓ ట్వీట్ చేశారు. 
 
'భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కోసం డైమండ్ క్లబ్ కేటగిరీ ఒక్కో సీటుకు 20 వేల డాలర్ల రేటు పెట్టడం చూసి షాక్ అయ్యాను. అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నదే.. ఆటను మరింత విస్తరించడం, అభిమానులను అలరించడం కోసం. అంతే తప్ప అడ్డగోలు టికెట్ చార్జీలు పెట్టి లాభాలు ఆర్జించడం కోసం కాదు. మామూలు టికెట్ కోసం కూడా 2,750 డాలర్లు (సుమారు రూ.2.29 లక్షలు) ధర పెట్టడం దారుణం. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు.. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్రూక్స్ (మోసగాళ్ల కౌన్సిల్)' అని లలిత్ మోడీ విరుచుకుపడ్డారు.