1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

లోక్‌సభ ఎన్నికలు 2024 : 1600 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

election commission
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంది. ఇప్పటివరకు ఐదు దశల పోలింగ్ ముగింది. మరో రెండు దశల పోలింగ్ మిగిలివుంది. ఈ రెండు దశలు కూడా ఈ నెల 25వ తేదీ, జూన్ ఒకటో తేదీన నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లుచేసింది. జూన్ నాలుగో తేదీన సార్వత్రిక ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 8360 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో 1600 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ - ఏడీఆర్ వెల్లడించింది. ఈ 1600 మంది అభ్యర్థుల్లో 1188 మంది అభ్యర్థులు తీవ్రమైన నేరాలు, అభియోగాలు ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను పరిశీలించినట్టు ఏడీఆర్ తెలిపింది.
 
లోక్‌సభ తొలి దశ ఎన్నికల్లో మొత్తం 1,618 మంది అభ్యర్థులు పోటీపడగా అందులో 252 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది. ఇందులో 161 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇక రెండో దశలో మొత్తం 1,192 మంది అభ్యర్థులు పోటీ పడగా 250 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారని తెలిపింది. ఇందులో 167 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది.
 
లోక్‌సభ మూడో దశ ఎన్నికల్లో 1,352 మంది అభ్యర్థులు పోటీ చేయగా 244 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 172 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో జరిగిన నాలుగో దశలో అత్యధికంగా 1,710 మంది అభ్యర్థులు పోటీ పడగా అందులో 360 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 274 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది.
 
ఇక ఐదో దశలో 695 మంది అభ్యర్థులు పోటీ పడగా 159 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 12 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ తెలిపింది. 6వ దశలో పోటీ పడే 866 మంది అభ్యర్థుల డేటాను విశ్లేషించగా 180 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా గుర్తించామని ఏడీఆర్ డేటా పేర్కొంది. వారిలో 141 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయని పేర్కొంది. చివరిదైన 7వ దశలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 199 మందిపై కేసులు ఉన్నాయి. వారిలో 151 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ వివరించింది.