గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 9 డిశెంబరు 2018 (10:46 IST)

అడిలైడ్ టెస్ట్ : ఆస్ట్రేలియా ముంగిట ఊరించే లక్ష్యం

అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముంగిట 323 పరుగుల ఊరించే విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో భారత్ స్వల్ప వ్యవధిలోనే ప్రధాన వికెట్లను కోల్పోయింది. 
 
భారత్ తన ఓవర్ నైట్ స్కోరు 151/3తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్‌కు పుజారా-రహానే జోడీ శుభారంభం ఇచ్చింది. వీళ్లిద్దరూ వికెట్ పడకుండా ఆడుతూ స్కోరును పెంచారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నారు. తర్వాత పుజారా, రోహిత్ వెంటవెంటనే అవుటైనా.. పంత్(28) సాయంతో రహానే ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. 
 
అయితే వేగంగా ఆడే క్రమంలో పంత్ కూడా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన అశ్విన్ సహా బౌలర్లంతా చేతులెత్తేయడంతో భారత్ 307 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆసీస్ ముందు 323 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
 
ఒకానొక దశలో భారత్ భారీ స్కోరు సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే, ఆసీస్ బౌలర్ లియాన్, స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో భారత్ వికెట్లు టపటపా రాలిపోయాయి. 303 పరుగుల వద్ద వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో లియాన్ ఆరు, స్టార్క్ మూడు, హజెల్‌వుడ్ ఒక వికెట్ తీశారు.