శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (09:38 IST)

కోహ్లీ సేన నవశకం : ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ కైవసం

ఇంతకాలం సొంతగడ్డపై తమకు ఎదురేలేదని బీరాలకు పోయిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు తేరుకోలేని అతిపెద్ద షాక్ తగిలింది. ఏడు దశాబ్దాలుగా టీమిండియాపై ఆస్ట్రేలియా చూపెడుతున్న ఆధిపత్యానికి ఎట్టకేలకు చెక్ పడింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చిన కోహ్లీ సేన... నాలుగో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. దీంతో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. చారిత్రక సిరీస్‌ను కైవసం చేసుకుంది. 
 
ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్‌ను కైవసం చేసుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది. 4 టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ గెలిచింది. వర్షం కారణంగా టెస్టు చివరి రోజు మ్యాచ్‌ను అధికారులు రద్దు చేసి డ్రాగా ప్రకటించారు. దీంతో భారత్ సిరీస్‌ను గెలిచింది. 
 
అంతకుముందు ఆదివారం నాలుగో రోజు కూడా భారత్ ఆధిక్యమే కొనసాగింది. కుల్దీప్ యాదవ్ (5/99) స్పిన్ దెబ్బకు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104.5 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. 2005 తర్వాత ఆసీస్‌ను ఫాలోఆన్ ఆడించడం ఇదే తొలిసారి. నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కంగారూలు ఫాలోఆన్ ఆడారు. 
 
అయితే స్వదేశంలో మాత్రం 1988లో ఇదే వేదికపై ఇంగ్లండ్ చేతిలో ఫాలోఆన్ ఆడారు. ఓవరాల్‌గా 322 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు వెలుతురులేమి ప్రతికూలంగా మారింది. టీ విరామం తర్వాత దాదాపు గంటపాటు వేచి చూసినా ఫలితం లేకపోయింది. 
 
ఓ దశలో 6 గంటల వరకు మ్యాచ్‌ను కొనసాగించాలని భావించినా సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఎట్టకేలకు 5.20 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రద్దయ్యే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. చివరి రోజైన సోమవారం కూడా మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.