1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (10:12 IST)

అమ్మతోడు.. ట్కికెట్లన్నీ అమ్ముడు పోయాయి : హైచ్.సి.ఏ

match tickets
ఈ నెల 25 తేదీన భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికలో జరుగనుంది. ఇందుకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) గురువారం టిక్కెట్ల అమ్మకాన్ని చేపట్టింది. కౌంటర్లలో టిక్కెట్ల అమ్మకం ప్రారంభమైన కొద్దిసేపటికే టిక్కెట్లు ఖాళీ అయిపోయినట్టు హెచ్.సి.ఏ నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు హెచ్.సి.ఏ ఓ ప్రకటన చేసింది. 
 
ఇదివరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని తెలిపింది. ఇందుకోసం శుక్ర, శని, ఆదివారాల్లో కౌంటర్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయని చెప్పింది. 
 
ఆన్‌లైన్లో బుక్ చేసుకున్న వాళ్లు ఈ మెయిల్ కన్ఫర్మే షన్ చూపించడంతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించాలని, దాని జిరాక్స్‌ను కూడా ఇచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
 
ఇతరులు బుక్ చేసిన టికెట్లను తీసుకోవాలంటే ఇద్దరి ఫొటో గుర్తింపు కార్డులు, జిరాక్సులను జత చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ.. ఫిజికల్ టికెట్లు ఉంటేనే ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు అనుమతి ఉంటుందని హైదరాబాద్ క్రికెట్ సంఘం స్పష్టం చేసింది.