శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (16:23 IST)

భారత్‌కు బయలుదేరిన కోహ్లీ ... టీమిండియా కెప్టెన్‌గా రహానే

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి బయలుదేరాడు. దీంతో కోహ్లీ స్థానంలో భారత క్రికెట్ జట్టు సారథిగా అజింక్యా రహానే పేరును ఖరారు చేశారు. 
 
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇప్పటికే వన్డే, ట్వంటీ20 సిరీస్‌లు ముగియగా, తొలి టెస్టు కూడా పూర్తయింది. ఈ టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఇంకా మరో మూడు టెస్టులు మిగిలివున్నాయి. 
 
ఈ క్రమంలో తన భార్య గర్భంతో ఉండటంతో తనకు పెటర్నటీ సెలవు కావాలని కోహ్లీ కోరడంతో బీసీసీఐ సమ్మతం తెలిపింది. కోహ్లీ భార్య అనుష్కశర్మ ఈ వారంలో డెలివరీ కానుంది. ఈ తరుణంలో, కాన్పు సమయంలో తన భార్య పక్కనే ఉండాలనే ఉద్దేశంతో కోహ్లీ ఇండియాకు తిరిగి వస్తున్నాడు.
 
కోహ్లీ జట్టుకు దూరం కావడంతో మిగిలిన మూడు మ్యాచ్‌లకు అజింక్యా రహానే కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. మరోవైపు ఇండియాకు బయల్దేరే ముందు జట్టు సభ్యులతో కోహ్లీ సమావేశమయ్యాడు. తొలి టెస్టులో ఘోర పరాభవం మూటకట్టుకున్న నేపథ్యంలో తన సహచరులకు మార్గనిర్దేశం చేశాడు. ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు.
 
మరోవైపు ఇండియన్ స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ సిడ్నీలో క్వారంటైన్‌లో ఉన్నాడు. కరోనా నేపథ్యంలో అతను ఎక్కడకూ వెళ్లకుండా తన గదికే పరిమితమయ్యాడు. రోహిత్ క్షేమంగా ఉన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రెండో టెస్టు తర్వాత రోహిత్ జట్టుతో కలవనున్నాడు.