1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (22:15 IST)

పూణె వన్డే మ్యాచ్ : భారత్ ముంగిట 257 రన్స్ టార్గెట్

bangladesh batsman
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక పోరు సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్లు హాసన్, లిటన్ దాస్‌లు మంచి శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ మిగిలిన బంగ్లా బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేక పోయారు. ఫలితంగా ఆ జట్టు 260 లోపు పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
బంగ్లా జట్టులో ఓపెనర్లు హాసన్ 51, లిటన్ దాస్ 66, శాంటో 8, మిరాజ్ 3, హృదయ్ 16, రహీం 38, మహ్మదుల్లా 46, అహ్మద్ 14 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజాలు రెండేసి వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
మరోవైపు, ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. మ్యాచ్‌లో ఇండియా 9వ ఓవర్ లో బౌలింగ్ చేస్తుండగా... బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లిట్టన్ దాస్ స్ట్రయిట్ డ్రైవ్ కొట్టాడు. ఈ సందర్భంగా బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా గాయపడ్డాడు. ఫిజియో వచ్చి హార్దిక్‌ను పరీక్షించాడు. ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. దీంతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.
 
మరోవైపు పాండ్యా గాయంపై బీసీసీఐ ప్రకటన చేసింది. స్కానింగ్ కోసం పాండ్యాను ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. అతన్ని ఒక మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. అయితే పాండ్యా గాయం తీవ్రతపై మాత్రం స్పష్టతను ఇవ్వలేదు.