శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (16:03 IST)

రోహిత్ శర్మ ఖాతాలో 2 రికార్డులు.. ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయభేరి

అక్లండ్‌లో కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా చేధించి ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. ఫలితంగా 1-1 తేడాతో టీ-20 సిరీస్‌ను భారత్ సమం చేసింది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల పతనానికి 158 పరుగులు సాధించింది. 
 
భారత బౌలర్ల ధాటికి ధీటుగా రాణించలేకపోయారు.. కివీస్ బ్యాట్స్‌మెన్. అయితే గ్రాండ్ హోమ్ 50, టేలర్ 42 పరుగులు సాధించడంతో కివీస్ ఆ మాత్రం పరుగులైనా నమోదు చేసుకోగలిగింది. భారత బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు, అహ్మద్ రెండు పడగొట్టగా.. భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 
 
తదనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ 9.2 ఓవర్లలో 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ రోహిత్ 50 పరుగులు సాధించి సోధీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆపై 30 పరుగుల వద్ద ధావన్ అవుట్ అయ్యాడు. విజయ్ శంకర్ 14 పరుగులు సాధించాడు. 
 
ఆపై క్రీజులోకి దిగిన పంత్, ధోనీ నిలకడగా ఆడుతూ జట్టును గెలిపించారు. యువ క్రికెటర్ పంత్ వేగంగా ఆడుతూ 28 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ధోనీ 20 పరుగులు సాధించాడు. కివీస్ బౌలర్లలో మిచెల్, సోధీ, ఫెర్గ్యూసన్‌లు చెరో వికెట్ తీశారు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
 
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఖాతాలో రికార్డులు చేరాయి. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా (2,288) అవతరించాడు. టీ20ల్లో అత్యధిక 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డును సాధించాడు. రోహిత్ ఈ ఘనతను 20 సార్లు సాధించాడు.