1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (21:22 IST)

ఐసీసీ ట్వంటీ20 కప్ : భారత్ 151 ఆలౌట్ - పాక్ టార్గెట్ 152 రన్స్

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్ -12 గ్రూప్ 2 మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఫలితంగా ప్రత్యర్థి ముంగిట 152 పరుగులను విజయలక్ష్యంగా ఉంచింది. 
 
అంతకుముందు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు తిగిన భారత్‌కు ఆది నుంచే కష్టాలు వెంటాడాయి. తొలి ఓవర్ నాలుగో బంతికి స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీగా వెనుదిరగ్గా, మూడో ఓవర్ తొలి బంతికి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ బౌల్డయ్యాడు. 8 బంతులు ఆడిన రాహుల్ 3 పరుగులు మాత్రమే చేశాడు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా 8 బంతుల్లో ఒక ఫోర్, ఓ సిక్సర్ సాయంతో 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ జతకలిసిన రిషబ్ పంత్ 30 బంతులను ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికీ భారత్ స్కోరు 12.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు. 
 
ఆ తర్వాత పంత్ తర్వాత రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోరును పెంచాడు. దీంతో భారత్ 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. 
 
అయితే, విరాట్ కోహ్లీ మాత్రం జట్టు భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా మొత్తం 49 బంతుల్లో 1 సిక్సర్లు 5 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. అలాగే, రవీంద్ర జడేజా కూడా 13 బంతుల్లో 1 ఫోర్లు సాయంతో 13 పరుగులు చేశాడు. అలాగే, హర్దీక్ పాండ్య 8 బంతుల్లో 11 రన్స్ చేయగా, భువనేశ్వర్ కుమార్‌ 4 బంతుల్లో 5 రన్ప్ చొప్పున పరుగులు చేశారు. షమీ పరుగులేమీ చేయలేదు. 
 
ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ విజయం సాధించాలంటే 152 రన్స్ చేయాల్సివుంది. పాక్ బౌలర్లలో ఆఫ్రిది 3 వికెట్లు, అలీ 2, ఖాన్, రౌఫ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.