1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (21:39 IST)

టీ20 ప్రపంచకప్: బ్లాక్ బస్టర్ పోరు.. దాయాదీ దేశాల మధ్య సమరం

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్.. ఈ బ్లాక్ బస్టర్ పోరుకు వేదిక కానుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాదీ దేశాలు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. 
 
ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడే తుది జట్టును పాకిస్థాన్ ఒకరోజు ముందే ప్రకటించింది. 12 మంది సభ్యులతో పాక్ టీమ్ జట్టును ప్రకటించగా.. అందులో బాబర్ ఆజమ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ ఉన్నారు.
 
ఇకపోతే.. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది. 2007 వరల్డ్ కప్ బౌలౌట్‌తో మొదలైన భారత్ విజయ ప్రస్థానం గత 2016 టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగింది.
 
గతంలో సౌతాఫ్రికా వేదికగా జరిగిన అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌లో ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్ దాయాదీతోనే ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. ఆ టోర్నీ ఫైనల్లో కూడా భారత్-పాక్ మరోసారి తలపడ్డాయి. 
 
ఆర్పీ సింగ్‌ (3/26), ఇర్ఫాన్‌ పఠాన్ (3/16), జోగిందర్ శర్మ (2/20) అద్భుత బౌలింగ్‌తో భారత్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. కాగా ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లలో భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఈ ఐదు సార్లు కూడా భారతే విజేతగా నిలిచింది.