1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (16:03 IST)

అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప రికార్డుకు చేరువలో భువనేశ్వర్

Bhuvneshwar Kumar
భారత క్రికెట్ జట్టు పేసర్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప రికార్డుకు చేరువలో ఉన్నారు. ప్రస్తుతం స్వదేశంలో పర్యాటక సౌతాఫ్రికా జట్టుతో ఐదు మ్యాచ్‌లో టీ 20 సిరీస్ జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత జట్టు ఓడిపోయింది. మంగళవారం విశాఖ వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరుగనుంది. 
 
అయితే, ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క వికెట్ తీస్తే మాత్రం తన పేరిట కొత్త రికార్డును లిఖించుకుంటారు. పవర్‌ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన అంతర్జాతీయ టీ20 బౌలర్‌గా నిలుస్తాడు. ఇంతకుముందు కటక్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో భువి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 13 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
 
అందులో మూడు వికెట్లు పవర్‌ప్లేలోనే వచ్చాయి. దీంతో టీ20 పవర్‌ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వెస్టిండీస్‌ బౌలర్‌ సామ్యూల్‌ బద్రీ, న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌సౌథీ సరసన నిలిచాడు. ప్రస్తుతం ఈ ముగ్గురూ తలా 33 వికెట్లు తీసి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 
 
అందులో భువనేశ్వర్‌ 59 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి రెండో స్థానంలో నిలవగా.. సామ్యూల్‌ 50 ఇన్నింగ్స్‌ల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. సౌథీ 68 ఇన్నింగ్స్‌ల్లో మూడో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా పేసర్‌ నేటి మ్యాచ్‌లో మరోసారి వికెట్లు పడగొడితే.. వారిద్దర్నీ వెనక్కినెట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు.