1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 జులై 2021 (14:11 IST)

టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. పంత్‌కు కరోనా.. యూరో మ్యాచ్‌కు వెళ్లినందుకేనా..?

ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ఆ దేశ పర్యటనలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తప్పెట్లు లేదు. ఇండియన్ టీమ్‌లో ఓ ఆటగాడికి కరోనా సోకినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ప్లేయర్ ఎవరో కాదు లేటెస్ట్ సెన్షెషన్ వికెట్ కీపర్ రిషబ్ పంతే అని స్పోర్ట్స్ టాక్‌తో పాటు పలు జాతీయ మీడియా సంస్థలు తన రిపోర్ట్‌లో పేర్కొన్నాయి. అంతేకాదు వారం కిందటే అతనికి కరోనా సోకిందని, అయితే లక్షణాలేవీ లేవని తెలిపింది. 
 
యూరోలో భాగంగా లండన్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్‌, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి పంత్ వెళ్లిన విషయం తెలిసిందే. పంత్‌కు డెల్టా వేరియంటే సోకినట్లు తెలుస్తోంది. ఈ వేరియంటే ఇండియాలో సెకండ్ వేవ్‌కు కారణమైన విషయం తెలిసిందే.
 
ఇప్పటి వరకూ మరే ఇతర ప్లేయర్ కూడా పాజిటివ్‌గా తేలలేదని… కరోనా ప్రొటోకాల్ పాటించాలని ఇప్పటికే బోర్డు సెక్రటరీ జే షా ప్లేయర్స్‌కు మెయిల్ పంపారు అని శుక్లా వెల్లడించారు. రిషబ్ పంత్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడు డర్హమ్ వెళ్లిన టీమ్‌తో ఇప్పట్లో కలిసే అవకాశం లేదు. అటు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఓ ప్లేయర్‌కు కరోనా సోకిన మాట నిజమే అని చెప్పినా.. అతని పేరు మాత్రం చెప్పలేదు. 
 
అవును, ఓ ప్లేయర్‌కు కరోనా వచ్చింది. అతడు 8 రోజులుగా ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. అతడు హోటల్ రూమ్‌లో ఉండటం లేదు. అందువల్ల మిగతా ప్లేయర్స్‌పై దీని ప్రభావం లేదు. అయితే ఆ ప్లేయర్ మాత్రం చెప్పలేను అని శుక్లా చెప్పారు. అయితే ఆ ప్లేయర్ పంతే అని బీసీసీఐ వర్గాల సమాచారం.