శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (18:52 IST)

ఈడెన్ గార్డెన్స్ గులాబీ మయం.. చరిత్రలో నిలిచిన ఇషాంత్ శర్మ (Video)

భారత్-బంగ్లాదేశ్ జట్లు పింక్ బాల్‌తో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయి. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు షాద్‌మాన్‌ ఇస్లాం, ఇమ్రూల్‌ కేయాస్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. 
 
తొలి బంతిని టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ వేయగా.. షాద్‌మాన్‌ ఆడాడు. భారత​ గడ్డపై టెస్ట్‌ మ్యాచ్‌లో పింక్‌ బాల్‌ సంధించిన తొలి బౌలర్‌గా ఇషాంత్‌ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. దాయాది దేశంలో పింక్‌ బాల్‌ ఎదుర్కొన్న తొలి బ్యాట్స్‌మన్‌గా షాద్‌మాన్‌ నిలిచాడు.
 
ఇక పరుగులేమీ లేకుండానే తొలి ఓవర్ ముగిసింది. రెండో ఓవర్‌ ఉమేశ్‌ యాదవ్‌ వేశాడు. మరోవైపు పింక్‌బాల్‌ టెస్ట్‌ మ్యాచ్‌‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన క్రికెట్‌ అభిమానులు, ప్రముఖులతో ఈడెన్‌ గార్డెన్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసినా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ్యాచ్‌ వీక్షించేందుకు ఈడెన్‌ గార్డెన్స్‌కు విచ్చేశారు. సోషల్‌ మీడియాలో #PinkBallTest హాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది.
 
ఇకపోతే.. భారత్‌లో తొలి డే నైట్ టెస్టు ప్రారంభమైంది. కోల్‌కతాలోనీ ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న డే నైట్ టెస్టు 12వది కావడం విశేషం.
 
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో డే నైట్ టెస్టు ఆడిన 9, 10వ జట్లుగా భారత్, బంగ్లాదేశ్‌లు నిలిచాయి.
 
ఈ డే నైట్ టెస్టు మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమై తొలి సెషన్‌ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. లంచ్ విరామం నలభై నిమిషాలు. అనంతరం 3:40 గంటలకు ప్రారంభమయ్యే రెండో సెషన్‌ 5:40వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 20 నిమిషాలు టీ విరామం ఉంటుంది.
 
ఆఖరి సెషన్‌ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఈ డే నైట్ టెస్టుని క్యాబ్ అంగరంగవైభవంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే కోల్‌కతాలోని వీధులన్నీ గులాబీమయం అయ్యాయి.