1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (19:55 IST)

రెండో టెస్ట్ మ్యాచ్ : తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ స్కోరు 227 అలౌట్

test india
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు గురువారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌట్ అయింది. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారీ స్కోరుపై కన్నేసి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, బంగ్లా ఆశలపై భారత బౌలర్లు నీళ్లు కుమ్మరించారు. భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కట్‌లు సత్తా చాటడంతో ఆ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లోనే 227 పరుగులు ఆలౌట్ అయింది. ఫలితంగా తొలి రోజు సాయంత్రానికే బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. 
 
భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 25 పరుగులు ఇచ్చిన నాలుగు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 71 పరుగులిచ్చి నాలుగు, లెఫ్టార్మ్ స్పిన్నర్ జయదేవ్ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్‌, అక్షర్ పటేల్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. అలాగే, బంగ్లా ఇన్నింగ్స్‌లో మోమినుల్ హక్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముష్ఫికర్ రహీం 26, లిట్టన్ దాస్ 25, నజ్ముల్ హుస్సేన్ శాంటో 24, షకీబల్ హాసన్ 16 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలి రోజు ఆట మువగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ 3, గిల్ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.