గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (14:16 IST)

ఇంగ్లండ్ టూర్‌ కోసం సూర్య కుమార్ - పృథ్వీ షా ఎంపిక

భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ టూర్ ఆరంభంకాకముందే జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు గాయాలబారినపడ్డారు. ఈ టూర్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొదట ప్రారంభంకానుంది. 
 
అయితే, వార్మప్ మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్ మన్ గిల్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్టాండ్ బైగా ఎంపికైన పేసర్ అవేశ్ ఖాన్‌లు గాయపడ్డారు. వీరు కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలపడంతో... టీమ్ మేనేజ్‌మెంట్ రీప్లేస్‌మెంట్ కోరింది.
 
దీంతో, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారి స్థానంలో ఇద్దరు ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పంపాలని నిర్ణయించింది. సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్న విషయం తెల్సిందే. 
 
పైగా, ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు. వీరిద్దరిలో పృథ్వీ షాకి ఇప్పటికే టెస్టు మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం ఇదే తొలి టెస్టు సిరీస్ కానుంది. 
 
అలాగే, సూర్యకుమార్ ఈ ఏడాదే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంక సిరీస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తొలి వన్డే సిరీస్‌లోనే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.