బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2022 (11:29 IST)

ఒంటి చేత్తో భారత్‌ను గెలిచిన విరాట్ కోహ్లీ... సచిన్ రికార్డు బద్ధలు

virat kohli
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, ఆదివారం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌ను మాజీ సారథి విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో గెలిపించారు. అదేసమయంలో ఆయన పలు రికార్డులను బద్ధలు కొట్టారు. ఐసీసీ టోర్నీల్లో అత్యధికసార్లు 50కి పైగా స్కోరు సాధించిన ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. 
 
కాగా, 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఒక దేశలో ఓటమి అంచులకు చేరింది. కానీ, క్రీజ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఏమాత్రం ఛాన్స్ వచ్చినా ఫోర్లు, సిక్స్‌లు బాదేస్తూ జట్టును గెలిపించాడు. కళ్లు చెదిరే షాట్లు కొడుతూ 82 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పలు రికార్డులను ఆయన సొంతం చేసుకున్నాడు. 
 
* అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా అవతరించాడు. ఇప్పటివరకు మొత్తం 14 సార్లు అవార్డులు అందుకున్నాడు. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్ ఆటగాడు మొహమ్మద్ నబీని వెనక్కి నెట్టేశాడు. 
 
* టీ20 రన్ ఛేజింగ్‌లో అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన ఆటగాడిగా పాకిస్థాన్ క్రికెటర్ షోయర్ మాలిక్ (18సార్లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ సమం చేశాడు. 
 
* టీ20 ప్రపంచ కప్‌‍లో 6వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కోహ్లీ అందుకున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (5 సార్లు) రికార్డును కోహ్లీ అధికమించాడు. 
 
* పాకిస్థాన్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు (3,794) చేసిన క్రికెటర్‌గా రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు 3,741 పరుగులతో మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మను రెండో స్థానానికి నెట్టేశాడు. 
 
* ఐసీసీ టోర్నీల్లో అత్యధిక 50 ప్లస్ పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. సచిన్ టెండూల్కర్ 23 సార్లు 50 ప్లస్  పరుగులు చేయగా, కోహ్లీ ఆదివారం 24వ సారి ఆ ఫీట్ సాధించిన ఆటగాడిగా అవతరించాడు.