గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (15:58 IST)

ఆ పని చేయడమే తన ప్రథమ కర్తవ్యం : సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ నియమితులుకానున్నారు. బీసీసీఐ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ సోమవారమేకావడంతో సౌరవ్ గంగూలీ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, ఇతర పోస్టులకు కూడా ఇతరులెవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో నామినేట్ అయిన సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. 
 
సో... బీసీసీఐ కొత్త చీఫ్‌గా గంగలీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గంగూలీ స్పందిస్తూ, బీసీసీఐ అధ్యక్షుడు కావడమనేది ఒక గొప్ప అనుభూతి. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా జట్టు సారథ్య బాధ్యతలను కూడా నిర్వహించారు. అలాంటి తనకు ఇది ఒక గొప్ప అనుభూతి. గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి బాగోలేదని, ఇమేజ్ దెబ్బతిందని... ఇలాంటి స్థితిలో తాను పగ్గాలు చేపట్టబోతున్నానని గుర్తుచేశారు. 
 
బీసీసీఐ ఇమేజ్‌ను మళ్లీ పెంచడానికి ఇది తనకొక గొప్ప అవకాశమన్నారు. ముఖ్యంగా దేశవాళి క్రికెట్‌ను బలోపేతం చేసే క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. తన తొలి ప్రాధాన్యత ఫస్ట్ క్లాస్ క్రికెటర్లే అయినప్పటికీ... తన ఆలోచనపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. 
 
బీసీసీఐ అడ్వైజరీ కమిటీకి గత మూడేళ్లుగా తాను ఇదే విషయం చెబుతున్నట్టు తెలిపారు. అయితే వారు పట్టించుకోలేదన్నారు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ అతి పెద్ద ఆర్గనైజేషన్ అని, ఆర్థికంగా ఒక పవర్ హౌస్ వంటిదని... అలాంటి బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడం ఒక ఛాలెంజ్ అని తెలిపారు.