సోమవారం, 17 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మార్చి 2025 (10:45 IST)

ఆ రోజున గదుల్లో ఒంటరిగా ఉండటం కంటే ఫ్యామిలీతో ఉండటానికి ఇష్టపడతా : విరాట్ కోహ్లి

kohli
మైదానంలో కష్టంగా గడిపిన రోజున హోటల్ గదిలో ఒంటరిగా ఉండటం కంటే కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు తాను ఇష్టపడతానని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డారు. అందువల్ల భారత క్రికెట్ జట్టు సభ్యుల పర్యటనల సమయంలో వారి వెంట వారి కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో 1-3 ఓటమి తర్వాత కుటుంబ సభ్యులతో భారత క్రికెటర్లు ఉండే సమయాన్ని బీసీసీఐ తగ్గించింది. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఈ వ్యాఖ్యలు చేశాడు. 
 
బీసీసీఐ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 45 రోజులకు మంచిన పర్యటనలో కుటుంబ సభ్యులు క్రికెటర్లతో రెండు వారాలకు మించి ఉండటానికి వీలు లేదు. ఇక చిన్న పర్యటనల్లో మాత్రం వారం వరకు ఉండొచ్చు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కోహ్లి, జడేజా, షమి, వారి కుటుంబ సభ్యులతో ఉన్నారు. కానీ, వాళ్లు జట్టు హోటల్‌లో లేకుండా వాళ్ల ఖర్చులను క్రికెటర్లే భరించారు. 
 
"కుటుంబ సభ్యుల పాత్ర ఎలాంటిదో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. మైదానంలో తీవ్ర పోటీ తర్వాత వాళ్లతో గడిపితే ప్రశాంతంగా ఉంటుంది. అలా చేయడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో ప్రజలకు తెలుసని నేను అనుకోను. నా రూమ్‌కు వెళ్లి ఒంటరిగా చిరాకుగా కూర్చుకోవాలనుకోను. సాధారణంగా ఉండాలనుకుంటాను. కుటుంబంతో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. కుటుంబ సభ్యులతో ఉంటే సంతోషంగా ఉంటుంది. వాళ్లతో ఉండటానికి వీలు కల్పించే ఏ చిన్న అవకాశాన్ని కూడా నేను వదిలిపెట్టను అని కోహ్లి చెప్పుకొచ్చాడు. 
 
అంతేకాకుండా, క్రికెటర్లకు సంబంధించిన ఈ విషయాలతో సంబంధం లేని వ్యక్తులు అనవసర చర్చలు చేయడం, కుటుంబాలను దూరంగా ఉండాలనడం నిరాశ కలిగిస్తోందని కోహ్లి చెప్పాడు. ప్రతి ఆటగాడు కుటుంబం తనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటాడని చెప్పాడు.