ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (13:31 IST)

ఐపీఎల్‌లో బోణీ కొట్టని ఢిల్లీ క్యాపిటల్స్.. ఓటమికి వారిదే బాధ్యత.. సెహ్వాగ్

sehwag
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ డీసీ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీని ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 151 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టుకు భారత మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ, ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్‌ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ వరుస ఓటములను చవిచూస్తుంది. 
 
ఈ ఓటములపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓటమికి వీరిద్దరూ బాధ్యత తీసుకోవాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 'జట్టు ఓడినా, గెలిచినా కోచ్‌లదే ప్రధాన పాత్ర. కాబట్టి, ఢిల్లీ ఇప్పుడు ఓడిన ఐదు మ్యాచ్‌లకు కోచ్‌ బాధ్యత తీసుకోవాలి. గత సీజన్‌ వరకూ రికీ పాంటింగ్‌ అద్భుతంగా బాధ్యతలను నిర్వర్తించాడు. ఢిల్లీని ఫైనల్స్‌కు చేర్చాడు. దాదాపు ప్రతి సంవత్సరం ప్లేఆఫ్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి క్రెడిట్‌ అతడి ఖాతాలో పడినప్పుడు, ఇప్పుడు ఓటమికి కూడా బాధ్యత తీసుకోవాలి. 
 
పైగా, ఇదేమీ భారత క్రికెట్‌ జట్టు కాదు. ఎందుకంటే అక్కడ ఎవరైనా గెలిస్తే తమ గొప్పగా భావిస్తారు. ఓడితే మాత్రం ఇతరులను నిందిస్తారు. ఏది ఏమైనా సరే ఐపీఎల్‌లో కోచ్‌ పాత్ర ఏమీ ఉండదు. శూన్యమనే చెప్పాలి. వారి పాత్ర కేవలం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం మాత్రమే. అయితే, తమ జట్టు గెలిస్తే కోచ్‌ ఆనందంగా ఉంటారు. ఈసారి ఢిల్లీ టీమ్‌ మాత్రం గొప్పగా రాణించలేదు. రాబోయే మ్యాచ్‌లలో ఢిల్లీ గెలిచి తమ రాతను మార్చుకోవాల్సిన అవసరం ఉంది' అని సెహ్వాగ్ సూచించాడు.