శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (16:52 IST)

క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఫలితాన్ని మరోమారు సమీక్షించాలి : గ్యారీ స్టీడ్

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు జరిగాయి. గత ఆదివారం నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఫైనల్ పోరుతో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు పోరాడి ఓడినప్పటికీ కోట్లాది మంది క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకుంది. 
 
అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించిన విధానంపైనే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇప్పటివరకు ఎవరికీ తెలియని బౌండరీ నిబంధన ఒకటి తెరపైకి వచ్చింది. ఇలాంటి నిబంధన ఒకటి ఉందని తెలిసి సగటు క్రికెట్ అభిమాని నివ్వెరపోతున్నారు. దీంతో బౌండరీ నిబంధన ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పైగా, ఓడిన న్యూజిలాండ్ జట్టుపై సానుభూతి వ్యక్తమవుతోంది. 
 
ఈ ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించిన విధానంపై న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ స్పందించారు. వరల్డ్ కప్ ఫైనల్ డ్రాగా ముగిసిందని.. అందువల్ల వరల్డ్ కప్‌ను ఇరు జట్లు షేర్ చేసుకుని.. రెండు జట్లను విజేతలుగా ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు. ప్రకటించిన ఫలితాన్ని ఐసీసీ మరోసారి సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. రెండు జట్లు నిర్ణీత ఓవర్లలో సమాన పరుగులు చేసినా ఇంగ్లండ్‌నే విజేతగా ప్రకటించడంతో ఏదో వెలితిగా ఉన్న భావన కలిగిందని గ్యారీ చెప్పారు.
 
గుప్తిల్ వికెట్లకు విసిరిన బంతి బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండ్రీ లైన్‌కు వెళ్లడం, అంపైర్ ఆరు పరుగులు ప్రకటించడం తెలిసిందే. అయితే.. రూల్స్ ప్రకారం ఐదు పరుగులు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఈ విషయంలో అంపైర్ తప్పిదం స్పష్టంగా కనిపించిందని క్రికెట్‌లో ప్రపంచ దిగ్గజ అంపైర్‌గా పేరొందిన టోఫెల్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 
 
ఈ విషయంపై న్యూజిలాండ్ కోచ్ స్టీడ్ స్పందిస్తూ తనకు ఆ రూల్ గురించి తెలియదని చెప్పారు. అంపైర్లు కూడా మనుషులేనని, కొన్ని సందర్భాల్లో మానవ తప్పిదాలు సహజమేనని స్టీడ్ తెలిపారు. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా దేన్నీ మార్చలేమని కివీస్ కోచ్ స్టీడ్ నిస్సహాయత వ్యక్తం చేశాడు. మొత్తంమీద ఈ 12వ ప్రపంచ కప్ పోటీలు మాత్రం సరికొత్త చర్చకు దారితీశాయని చెప్పొచ్చు.