1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (14:18 IST)

భార్యను హత్య చేసి లొంగిపోయేందుకు ఠాణాకు వెళుతూ...

murder
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను హత్య చేసిన ఓ భర్త... చేసిన నేరాన్ని అంగీకరించి లొంగిపోయేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వేగంగా వెళుతూ ఆగివున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని బంగారుగూడకు చెందిన అరుణ్‌కు నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. అయితే, పెళ్లయిన మొదటి రోజు నుంచి భార్య ప్రవర్తనను అనుమానిస్తూ వచ్చిన అరుణ్... శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హత్య చేశాడు. 
 
ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయేందుకు స్టేషన్‌కు బైకుపై బయలుదేరాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న అరుణ్ బైకు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అరుణ్ ప్రమాద స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.