1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

మహిళను లోబరుచుకున్నాడు.. అడ్డు చెప్పిన భర్తను చంపేశాడు.. వాలంటీర్ ఘాతుకం

murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు చూసుకుని ఏకంగా మానభంగాలు, హత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది వాలంటీర్లు దోపిడీలు, దొంగతనాలు, ఒంటరి మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా మరో వాలంటీర్.. దారుణానికి తెగబడ్డాడు. కువైట్‌కు వెళ్లిన వ్యక్తి భార్యను మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత భార్య చేస్తున్న తప్పును తెలుసుకుని మందలించాడు. దీన్ని జీర్ణించుకోలేని వాలంటీర్.. ఏకంగా ఆ మహిళ భర్తను హత్య చేయించాడు. ఈ హత్య గత నెల 31వ తేదీన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతుడు ఆటో డ్రైవర్ కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కాకులారంపల్లె ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న సుధాకర్ (35)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే సుధాకర్ మూడున్నరేళ్ల కిందట కువైట్ వెళ్లారు. పట్టణంలోని ఆర్టీసీ నల్లగుట్ట ప్రాంతానికి చెందిన గ్రామ వాలంటీరు కిశోర్ (32) ఆయన భార్యకు మాయమాటలు చెప్పి సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇల్లు ఇప్పిస్తానని చెప్పి లోబరుచుకున్నాడు. 
 
ఈ క్రమంలో కువైట్లో ఉన్న భర్త సుధాకర్ మూడు నెలల కిందట ఇంటికి వచ్చాడు. అతనికి తన భార్య చేస్తున్న తప్పును గ్రహించాడు. ఈ విషయం పోలీసులకు దృష్టికి తీసుకెళ్లగా, వారు వాలంటీరును మందలించి పంపించారు. దీంతో ఎలాగైనా సుధాకర్ అడ్డు తొలగించుకోవాలని వాలంటీరు కిశోర్ పథకం రచించాడు. 
 
ఈ క్రమంలో తిరుపతికి చెందిన ఉమా, చందు, సునీల్‌తో కలిసి సుధాకర్ హత్యకు పన్నాగం పన్నాడు. వారి చేత సైనేడ్ సూదులు కొనుగోలు చేయించాడు. ఒక వేళ సూది వేయడం కుదరకపోతే కత్తులతో హతమార్చాలని పథకం పన్నాడు. సుధాకర్ ఆగస్టు 31న కుమార్తెను పాఠశాల వద్ద దింపడానికి వెళ్లగా అనుకున్న ప్రకారం ముగ్గురు ఆయన వద్దకొచ్చి సైనేడ్ ఎక్కించిన సూదులతో గుచ్చి పరారయ్యారు. 
 
కాసేపటికే సుధాకర్ మృతి చెందారు. తన భర్త హత్యలో వాలంటీరు కిశోర్‌పై అనుమానాలున్నాయని ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీరు హస్తం ఉందని పోలీసులు తేల్చారు. కిశోర్‌ను అరెస్టు చేయగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ వివరించారు.