బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (13:04 IST)

బెంగుళూరులో కాకినాడ యువతి దారుణ హత్య.. ఎందుకో తెలుసా?

murder
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. ఏపీలోని కాకినాడకు చెందిన ఓ యువతి హత్యకు గురైంది. తనను దూరం పెట్టి మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధం కావడాన్ని జీర్ణించుకోలేక పోయిన ప్రియుడు.. ఆ యువతిని కత్తితో పొడిచి చంపేశాడు. బెంగుళూరు నగర శివారు ప్రాంతమైన జీవనబీమా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
కాకినాడకు చెందిన లీలా పవిత్ర ఉద్యోగ నిమిత్తం బెంగుళూరు వెళ్లి దొమ్లూర్‌లోని ఓ ప్రైవేటు లేబోరేటరీలో పని చేస్తుంది. అక్కడే పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత ఐదేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటూ, చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ విషయాన్ని లీలా పవిత్ర ఇంట్లో చెప్పగా, వారు దివాకర్‌తో పెళ్లికి అంగీకరించలేదు. 
 
అప్పటి నుంచి దివాకర్‌ను దూరం పెట్టసాగింది. తనకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని ప్రియుడికి చెప్పింది. దీన్ని దివాకర్ జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఆఫీసు బయటే లీలపై దివాకర్ కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి దివాకర్‌ను అరెస్టు చేశారు. అలాగే, లీలాను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఆమె శరీరంపై 16 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు.