1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మే 2022 (14:03 IST)

కొడుకు పుట్టాలన్న ఆశతో తాంత్రికుడితో కలిసి కుమార్తెలపై తండ్రి అత్యాచారం

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కుమారుడు పుట్టాలన్న ఆశతో తాంత్రికుడితో కలిసి కామాంధుడైన కన్నతండ్రి ఒకడు కన్నకుమార్తెలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లా రాజ్‌పుర్ తాలూకాలో వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికలు ఆ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బక్సర్ జిల్లా రాజ్​పుర్ తాలుకాకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పైగా, ఈయన ఓ నకిలీ వైద్యుడు. విటమిన్ ట్యాబ్లెట్ల పేరుతో బాలికలకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆ తర్వాత తన స్నేహితుడైన ఓ తాంత్రికుడితో తన క్లీనిక్​లోనే అత్యాచారం చేయిస్తూ వచ్చాడు. కొద్దిరోజులకు తాను సైతం కూతుళ్లపై రేప్ చేయడం మొదలుపెట్టాడు. 
 
తండ్రిని ఎదురిస్తే తీవ్రంగా కొట్టేవాడని బాలికలు తెలిపారు. దీంతో అతడి హింసను తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయారు. బక్సర్​లో చిన్న అద్దె ఇంట్లో ఉండసాగారు. అనంతరం, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులకు లేఖ రాశారు. తమపై జరిగిన లైంగిక దాడికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. 
 
బాలికల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. బాలికల తండ్రి, తల్లి, అత్తతో పాటు తాంత్రికుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. కొడుకు పుట్టాలన్న ఆశతోనే బాలికల తండ్రి ఇలా తాంత్రికుడితో కలిసి బరితెగించాడని వెల్లడించారు.