1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (17:59 IST)

కారుకు దారివ్వలేదని డెలివరీ బాయ్‌‌ని చితకబాదారు..

crime scene
దేశ రాజధాని ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లో అమానుష ఘటన ఒకటి జరిగింది. తన కారుకు దారి ఇవ్వని డెలివరీ బాయ్‌పై ఇద్దరు యువకులు చితక బాదారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడిక్కడే మరణించాడు. పోలీసుల కథనం మేరకు.. ఢిల్లీకి చెందిన పంకజ్‌ ఠాకూర్‌ (39) అనే వ్యక్తి తన కుటుంబంతో నగరంలో నివాసముంటున్నాడు. ఓ కిరాణా దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిత్యావసరాలను డోర్ డెలివరీ చేస్తుంటాడు. 
 
విధిలో భాగంగా ఓ రోజు సరకులను తీసుకెళ్తున్నాడు. ఏదో పనిపై తన స్కూటర్‌ను రోడ్డుపై ఆపాడు. అదేసమయంలో అక్కడికి ఒక కారువచ్చింది. కారులోని వారు రోడ్డుకు అడ్డంగా ఉన్న బండిని తీయమని అడిగారు. అతడు స్పందించకపోవటంతో కారు దిగి పంకజ్‌తో వాగ్వాదానికి దిగారు. 
 
తగాదా పెరగటంతో ఆ ఇద్దరు అతడ్ని చావబాదారు. దెబ్బలకు తాళలేక అతడు అక్కడే కుప్పకూలాడు. వెంటనే యువకులిద్దరు అక్కడి నుంచి పారిపోయారు. గాయాలతో పడి ఉన్న డెలివరీ బాయ్‌ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
 
ఆసుపత్రికి తీసుకురాక ముందే అతడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీని ఆధారంగా పోలీసులు నిందితులను మనీశ్‌ కుమార్‌ (19), లాల్‌చంద్‌ (20)గా గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు వారి ఇంటికి వెళ్లగా.. అప్పటికే వారు పరారయ్యారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఆదివారం మధ్యాహ్నం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.