1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 31 జులై 2023 (08:37 IST)

కేరళలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. హత్య

కేరళ రాష్ట్రంలో మరో చిన్నారి కామాంధుడి చేతిలో బలైపోయింది. ఐదేళ్ల చిన్నారిపై ఓ వలస కూలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను చంపేశాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్‌కు చెందిన ఓ దంపతుల జంట బతుకుదెరువు కోసం ఎర్నాకుళం వచ్చారు. వీరి ఐదేళ్ల కుమార్తె శుక్రవారం అదృశ్యమైంది. తమ కుమార్తె కోసం తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. ఫలితం లేకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఇందులో బాలిక కుటుంబం ఉండే భవనంలో ఇటీవల చేరిన బీహారీ కూలీ అస్పబ్ అస్లాం ఆ బాలికను తన వెంట తీసుకెళ్లినట్టు గుర్తించారు. రాత్రి వేళ అతడిని కస్టడీలోకి తీసుకున్నా.. బాగా తాగి ఉండడంతో ఏమీ వెల్లడించలేదు. మత్తు దిగాక పోలీసులు విచారించడంతో నిజం కక్కాడు. బాలికను మార్కెట్ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించారు. 
 
నేరం చేసిన ప్రదేశానికి అతడిని తీసుకుని వెళ్లగా మృతదేహాన్ని సంచిలో కుక్కి దానిపై చెత్త పోసి బస్తాలు పరిచిన దృశ్యం కనిపించింది. కాగా, చిన్నారి ఆచూకీ తెలపాలంటూ శుక్రవారం రాత్రంతా సోషల్ మీడియా హోరెత్తింది. ప్రయత్న లోపం లేకున్నా, ఆమెను కాపాడలేకపోయామంటూ పోలీసులు విచారం వ్యక్తం చేశారు. బాలికను అస్సఖ్ మధ్యాహ్నం ఎత్తుకెళ్లి సాయంత్రం చంపేశాడని తెలిపారు.