1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (08:43 IST)

వేలంటైన్స్ డేలో విషాదం.. : గోవా సముద్రపు నీటిలో మునిగి ప్రేమ జంట మృతి

lovers
ప్రేమికుల దినోత్సవం రోజున గోవాలో ఓ విషాదం చోటుచేసుకుంది. తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమించుకుంటూ వచ్చిన ఓ ప్రేమ జంట గోవా బీచ్‌లో మునిగిపోయి చనిపోయింది. వేలంటైన్స్ డే సెలెబ్రెషన్స్‌ను ఫ్యామిలీ మెంబర్స్‌కు తెలియుకుండా రహస్యంగా జరుపుకునేందుకు ఈ ప్రేమ జంట గోవాకు వెళ్లింది. అక్కడ మద్యంసేవించి రాత్రి భోజనం చేసిన తర్వాత బీచ్‌లోకి వెళ్లారు. కానీ, అక్కడ వారిద్దరూ చనిపోయారు. ఈ విషాదం గోవాలోని పలోలెం బీచ్‌లో జరిగింది. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుప్రియా దూబె (26), విభు శర్మ (27)గా గుర్తించారు.
 
పిటిఐ వార్తా కథనం మేరకు.. ముంబైలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసిన విభు శర్మ, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న సుప్రియా దూబేలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు వారు గోవాకు వెళ్లారు. ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఈత కొట్టేందుకు దక్షిణ గోవా జిల్లాలోని కెనకోనా తాలూకాలోని పలోలెం బీచ్ సమీపంలోని నీటిలోకి వెళ్లారు. 
 
మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పలోలెం సమీపంలోని ఊరెం బీచ్‌ వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె భాగస్వామి మృతదేహం మధ్యాహ్నం ఆ ప్రదేశానికి కొద్ది దూరంలో కనిపించిందని కెనకోనా పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. వీరిద్దరూ బస చేసిన హోటల్ సిబ్బందిని కూడా విచారించారు. సముద్రంలోకి వెళ్లే ముందు వీరిద్దరూ డిన్నర్, డ్రింక్స్ తీసుకున్నారని సిబ్బంది వెల్లడించారు. అలాగే, వీరిద్దరి మరణాలపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.