1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (11:29 IST)

అక్రమ బంధానికి అడ్డుగా ఉందనీ.. భార్యను చంపి చెట్టుకు ఉరేసిన భర్త .. ఎక్కడ?

పరాయి మహిళతో తాను కొనసాగిస్తున్న అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న అక్కసుతో కట్టుకున్న భార్యను ఓ కిరాతక భర్త గొంతు నులిమి చంపేసి, ఆపై చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసుల విచారణలో వాస్తవం ఏంటో బయటపడింది. దీంతో అతన్ని అరెస్టు చేశారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్ కర్నూలు జిల్లాలోని వడ్డె రాయవరం గ్రామానికి చెందిని కాట్రాజు చిన్న వెంకటయ్యకు పెద్దమ్మ(40) అనే మహిళతో చాలాకాలం క్రితం వివాహమైంది. కొంతకాలంగా వెంకటయ్య మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన భార్య.. భర్తను నిలదీస్తూ వచ్చింది. ఈ క్రమంలో తన అక్రమ బంధానికి అడ్డుగా ఉన్న భార్యను చంపేయాలని భర్త వెంకటయ్య పథకం పన్నాడు. ఈ నెల 22న సాయంత్రం సీతాఫలం కాయలు తీసుకొద్దామని చెప్పి భార్యను ఎద్దుల బండిపై నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. 
 
కొద్దిదూరం వెళ్లాక ఆమె గొంతు నులిపి హత్య చేశాడు. అనంతరం దాన్ని ఆత్మహత్యగా చిత్రకరించాలనుకున్నాడు. తన ప్రియురాలు, స్నేహితుడు ఆంజనేయులుతో కలిసి మృతదేహానికి ఉరేసి నల్లమల ప్రాంతంలో చెట్టుకు వేలాడదీశాడు. 
 
అయితే, తన అక్క పెద్దమ్మ కనిపించడంలేదని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. 25న అడవిలో ఉరివేసుకుని చెట్టుకు వేలాడుతూ ఉన్న పెద్దమ్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో ఆమెను హత్య చేసినట్టు తేలింది. దీంతో భర్తపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. చిన్న వెంకటయ్య, అతని ప్రియురాలు, ఆంజనేయులులను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.