1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 జులై 2022 (09:30 IST)

నా మొగుడిని చంపేయ్.. మనమిద్దరం సంతోషంగా ఉందాం...

murder
ఇటీవలి కాలంలో వివాహితలు అక్రమ సంబంధాలు పెట్టుకుని తమకు అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో కట్టుకున్న భర్తను ప్రియుళ్ళతో దారుణంగా హత్య చేయిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌‌పల్లిలో జరిగిన ఓ పండ్ల వ్యాపారి హత్య కేసులోనూ ప్రధాన సూత్రధారి మృతుని భర్త, ఆమె ప్రియుడేనని తేలింది. 
 
పోలీసుల కథనం మేరకు, కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన శంకరయ్య(43), జయసుధ(38) దంపతులు 14 ఏళ్ల క్రితం పటాన్‌చెరు సమీపంలోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. శంకరయ్య ఏడాది క్రితం శంకర్‌పల్లి మండలం టంగటూర్‌లో దానిమ్మ తోట లీజు తీసుకుని, అక్కడికి వారానికోసారి వచ్చి వెళ్తుండేవాడు. 
 
ఈ క్రమంలో బీరంగూడలోని పండ్ల దుకాణంలో ఉండే భార్య జయసుధకు సమీపంలో ఉండే జిమ్‌(వ్యాయామశాల) ట్రైనర్‌ తిరుపతిరావు(25)తో రెండు నెలల క్రితం పరిచయమేర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
తన భర్త శంకరయ్య నిత్యం మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతణ్ని చంపేస్తే.. మనమిద్దరం సంతోషంగా ఉండొచ్చని తిరుపతిరావుకి చెప్పింది. అనంతరం శంకరయ్య హత్యకు వారిద్దరూ కలిసి కుట్రపన్నారు. 
 
ఈనెల 11న శంకరయ్య తోటకు ఒంటరిగా వెళ్తున్నాడని.. చంపాలని ప్రియుడుకి సమాచారం అందించింది. శంకరయ్య తోటని చూసుకుని తిరిగి వస్తుండగా.. టంగటూర్‌ గ్రామ శివారులో తలపై కట్టెతో కొట్టి, కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. 
 
పోలీసులు నిందితుడు వాడిన ద్విచక్రవాహనం నంబర్‌ ఆధారంగా శుక్రవారం గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతిరావు స్వస్థలం విజయనగరం జిల్లా పచ్చిపెంట మండలం పంచాలి గ్రామంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.